ఒకట్రెండు ప్రాంతాల్లో విజయానికి దూరమైనా ఎక్స్ అఫిషియో ఓట్లతో వాటిని కూడా కైవసం చేసుకుంటాం: బొత్స

  • ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బొత్స స్పందన
  • చెప్పినట్టుగానే విజయాలు సాధించామని వెల్లడి
  • ఓటర్లకు బొత్స కృతజ్ఞతలు
  • అభివృద్ధికి పునరంకితం అవుతామని ఉద్ఘాటన
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెప్పినట్టుగానే తాము అన్ని చోట్లా విజయం సాధించామని అన్నారు. 100 శాతం విజయాలతో వైసీపీ దూసుకుపోయిందని తెలిపారు. కడప జిల్లాలో ఒక మున్సిపాలిటీ, అనంతపురం జిల్లాలో ఒక మున్సిపాలిటీలో విజయానికి దూరమైనా, ఎక్స్ అఫిషియో ఓట్లతో వాటిని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ప్రభుత్వం వైపే ఉన్నారని సీఎం చెప్పారని, ఫలితాల్లో అది నిజమైందని బొత్స వెల్లడించారు. ఇంతటి అఖండ విజయం అందించిన పట్టణ, నగర ప్రాంత ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. సమస్యల పరిష్కారంలో ఇంకా బాధ్యతతో పాటుపడతామని బొత్స ఉద్ఘాటించారు. ఈ విజయం తమ పనితీరుకు నిదర్శనమని, మళ్లీ అభివృద్ధికి పునరంకితం అవుతామని అన్నారు.

Botsa Satyanarayana
Municipal Elections
Results
YSRCP
Jagan
Andhra Pradesh

More Telugu News